RSS

డిసెంబరు నెలనెలా వెన్నెల Dec 29, 2008

చాలా కాలంగా బ్లాగు సరిగా రాయలేకపోతున్నాను.
చాలా కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాను. రకరకాల కారణలు.

పుస్తక ప్రదర్శనకని బయలుదేరాను, కానీ వెళ్ళలేకపోయా. చివరికి నెలనెలా వెన్నెలకు హాజరయ్యాను. దిల్‌షుక్‌నగర్, చైతన్యపురి, న్యూ మారుతి నగర్ లో జరుగుతుంది. ఇదివరలో ఆస్మాన్ ఘడ్‌లో జరిగేది. రోడ్డుకు కొంచెం దగ్గరగావుండేది. అయినా రామచంద్రపురంనుండి వెళ్ళే నాకు దగ్గరేమిటి దూరం ఏమిటి. నేను వెళ్ళే సరికి కొంతమంది అప్పటికే వచ్చివున్నారు. ఒబ్బిని, ధర్మాచారి, నాగార్జున, కె.వి. రామానాయుడు, మొహనరెడ్డి, వారి మిత్రుడు, ప్రార్వతిమోహన్, లలితకుమారి శిలాలోలిత ఇలా.

పలకరింపులు అయ్యాక ఈ మద్య కాలంలో మనల్ని వదిలిపెట్టివెళ్ళిన సాహితీమిత్రుల్ని ఒక్కసారి గుర్తు చెసుకుంటూ మౌనం పాటించారు. ఒబ్బిని తన కవిత్వ పఠనాన్ని ప్రారంబించారు. ఇంతలో ఇంద్ర ప్రసాద్, మరికొద్దిసేపటికి అద్దేపల్లి రామ్మొహన రావు వచ్చారు. అద్దేపల్లి జ్వాలముఖితో వున్న సాన్నిహిత్యాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు,

ఎప్పటిలాగే తన శ్రీకాకుళపు మాండలీకంతో విరుపుల, రాజశేఖరీయం అనే గల్పికను చదివి వినిపించారు.

శిలాలోలిత ఈమద్యకాలంలో దూరమౌతున్న సాహితీ మిత్రులను తలపోస్తూ ఏమైపోతున్నారు వీరంతా అంటూనే ......

ఈ మద్య తనకు ఆకాశవాణి జాతీయంగా ఎన్నుకున్న కవితను చదివి వినిపించారు.

వాళ్ళంతా దేహాన్ని విడిచారు
రాలిపడ్డ పూలల్లా వాళ్ళ అక్షరాలు
ఆ జ్ఞాపకాలను సమికరించుకుంటూ
దేహం అశశ్వతమని
అక్షరాల పూలే శాశ్వతమని చేదు గుళికలు మింగుతూ
రూప రహితులైన వారి జ్ఞాపకాలను
చమర్చుతున్న కన్నీళ్ళను అదిమిపడ్తూ ఆర్దత పొలమారుతుంటే
వాళ్ళ అక్షరాల వూత కర్రతో
ముందుకు మున్ముందుకు సాగిపోదాం!

మరోకవితలోని కొన్ని పాదాలు
" బ్రతుకు కంటే స్వేచ్చ గొప్పది
స్వేచ్చంటే బాధను చుట్టుకున్న పొర చేదింపబటమే" అంటారు

మోహన రెడ్డిగారు తనకవితను వినిపించారు.
అద్దేపల్లిగారితో వచ్చిన ఆయన శిష్యుడు స్వియరచనా పాటలని పాడివినిపించారు.

నడిచే పుస్తంకగా మేము పిలుచుకొనే రామనాయుడు కొన్ని కవితలను, దిగంబర కవిత్వంలో తనకు బాగా గుర్తున్న వాక్యాలను వినిపించారు

అన్నా!
నీ గాయాలపైనుండి వీచిన గాలి ఎరుపెక్కింది
నువ్వు ఆసరాచేసుకున్న బొడ్డుమల్లె ఎరుపెక్కింది
నువ్వు పడ్డచోట భూమి కూడా ఎరుపెక్కింది
ఇంకో మాట విన్నావా
నువ్వు కొట్టిన బాణం దెబ్బకు గాలికూడా ఎరుపెక్కింది

ఇక నావంతు వచ్చేసరికి నాదగ్గార నేను రాసినవి ఏమిలేకపోవడంవల్ల, ఈ మద్యకాలంలో నాకు నచ్చిన "పొద్దు" లో వచ్చిన చదరంగం - ఒరెమునా(చావా కిరణ్) అనే కవితను చదివి వినిపించాను.

మరో ఉదయం అస్తమించింది,
రాతిరి చీకటిని తలుచుకుంటూ
కన్నీటి ప్రవాహం సాక్షిగా,
యద రోదన సాక్షిగా,
నిరాశ, నిస్పృహ, నిర్లిప్త,
నిజ శరీర సాక్షిగా


మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలుచుకుంటూ.
తుఫానులో కలిసిపొయిన వారి జ్ఞాపకాల సాక్షిగా,
విరిగిన తెరచాప, మరుగయిన నీరాహారాల సాక్షిగా,
అనుచరులందరి అయోమయ చూపుల సాక్షిగా,
ఓటమిని గుర్తుచేస్తున్న సముద్రం సాక్షిగా,

మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలచుకుంటూ.
మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
నవ్వుల జల్లుల సాక్షిగా,
యద కేరింతల సాక్షిగా,
ఆనంద, మాధుర్య, సగర్వ,
సమ్మోహ స్వ శరీర సాక్షిగా



మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
కోమలి చెవిలో గుసగుసలాడుతుండగా,
దేవదూత రెండు కొత్త రెక్కలు తొడుగుతుండగా,
సూర్యుడు పంపిన ఏడు గుర్రాలు వేచిచూస్తుండగా,
వర్షం వెలసిన అందమైన అడవి పిలుస్తుండగా,
మరో ఉదయాగమనం.
రాతిరి పరిమళాలతో.

జీవితం ఎప్పుడూ ఇంతే,
ఒక కిటికీలో మోయలేని విషాదం
ఒక కిటికీలో భరించలేని ఆనందం."

ఇక లలితకుమారిగారు బాల సాయిబాబాపై రాసిన భక్తి పద్యాలను వినిపించారు, ముద్రితమైన పుస్తకాన్ని అందరికి పంచారు. చివరిగా అద్దేపల్లి ప్రెష్‌ష్ష్...........
కురగాయలు బహుళ కంపెనీలుగా మారిపోవడన్ని వినిపించారు.

తేనీరు సేవించి అందర్మూ ఒకరికొకరు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ శెలవు తీసుకున్నాము. బహుముఖాలుగా సాగిన ఈ సాహిత్య సాయంకాలం సుమహారంగా మారింది.

నిర్వహించిన సి.వి.కృష్ణారావుగారి మోములో కొత్త నందివర్దనం విరిసింది
........జాన్ హైడే కనుమూరి 3 కామెంట్‌లు