RSS

డిశెంబరు నెల సమావేశము - అందరికీ ఆహ్వానమే


12వ తేదీ ఆదివారము సాయంత్రము 5.30 గంటల నుండి

అందరికీ ఆహ్వానమే


స్థలము :
సి.వి.కృష్ణా రావు
103, బాబూ టవర్స్,
చైతన్యపురి, హైదరాబాదు
దూరవాణి 040 24044262

2374 1 కామెంట్‌లు

నెల నెలా వెన్నెల సమావేశము ౨౮.౧౧.౨౦౧౦


అందరికి ఆహ్వానం
౨౮.౧౧.౨౦౧౦ ఆదివారము
2270 1 కామెంట్‌లు

హృదయాంజలి - జాన్ హైడ్‌ - పుస్తకావిస్కరణ

2003, మార్చి 30వ తేదీన జరిగిన నెలనెలా వెన్నెల సమావేశము
స్థలము : ఆస్మాంఘడ్, మలకపేట, హైదరాబాదులో పుస్తకావిష్కరణ జరిగింది

ఆవిష్కర్త - శ్రీ మునిపల్లె రాజు

సాహిత్యంలోకి యాత్రికుడిగా వస్తున్న జాన్ హైడ్‌కు ఆహ్వానం పలుకుతూ అభినందించారు.



వక్తలు - శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ ఎం. వీరయ్య, శ్రీ శీలా వీర్రాజు, శ్రీ నాళేశ్వరం శంకరం ప్రసంగించారు.

నెలనెలా వెన్నెల మిత్రులు ఎక్కువమంది పాల్గన్నారు.

శ్రీ సి.వి. కృష్ణా రావు గారు వుంటున్న ఇంటిపైభాగము అప్పటికి ఖాళీ వుండటంతో అక్కడ నిర్వహించారు.

ఆవిష్కర్త - శ్రీ మునిపల్లె రాజు



వక్తలు శ్రీ - ఎం. వీరయ్య




వక్తలు - శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు
2242
1 కామెంట్‌లు

అక్టోబరు నెల సమావేశము

2139 0 కామెంట్‌లు

సెప్టెంబరు సమావేశము























నెల సమాఫేశములో సంకలనపు పనుల పురోగతిని గురించి చర్చించడమైనది. ఇప్పాటికి అందిన 38 కవితలను డి.టి.పి రూపంలో చిత్తుప్రతిని జాన్ హైడ్ తయారు చేశారు. వీలునుబట్టి పుస్తకం అక్టోబరు మాసపు నెలనెలావెన్నెలలో ఆవిష్కరించాలని ఒక ఆలోచన అందరి దగ్గరనుండి వెలువడింది. ఏదైనా హాలులో నిర్వహిస్తే ఎలావుంటుంది, చాలామంది రావడానికి అనుకూలంగా వుంటుందని అభిప్రాయం. సాద్యా అసాద్యాయాలు మిత్రులు బేరీజు వేయాలి



ఇంకా తమ కవితలు ఇవ్వనివారు 10 తేదీలోగా ఇస్తే బాగుంటుందని నెలనెలావెన్నెల సమయానికి పుస్తకాన్ని ముస్తాబుచెయ్యడానికి బాదుంటుందనే అభిప్రాయానికి వచారు.



బి.ఎస్.ఎం. కుమార్



ఎం.ఎస్. నాయుడు



జాన్ హైడ్ కనుమూరి



పార్వతీ మోహన్ తమ కవితలను చదివారు
నిశాపతి,



మురళీధర్ గౌడ్



నిత్యానందరావు,



సి.వి.కృష్ణరావు



శ్రీమతి సీతాదేవి గార్లు పాల్గొన్నారు



సి.వి. కృష్ణారావుగారి మనుమడు తర్వాతి నెల నేను కవిత్వాన్ని రాసి చదువుతాను అనడం కొసమెరుపు.





0 కామెంట్‌లు

సెప్టెంబరు సమాశము


0 కామెంట్‌లు

అమ్మ వచ్చింది నీ మాటలేదు

నాన్నా అమ్మను పిలువు
అమ్మ వచ్చింది నీ మాట లేదు

పాలగ్లాసు నింపి తాగిపో
ఇప్పుడేవస్తా
ఎప్పుడొస్తావు

ఆశల హారాలు నీకు తొడిగి
ఇంత బతుకు బతికాము
నిరాశల హారాలు మాకుతొడిగి
నీవు శాశ్వత శాంతిపొందావు

నిండిన ప్రేమఘటమనుకొన్న
ఈ బొందినుంచి పేగు మాడిపోయింది
అన్ని విలువలు ఆవిరైపొయినయి
పండంటి శిశువును హత్తుకున్న
తల్లి కౌగిలిలో మిగిలిందినీడ
ఇటు బాషాం అటు ఆక్సఫర్డు
నీతో మాట్లాడాల్ని ఎదురు చూస్తున్న స్నేహితులు

దారిన ముల్లు ఎవరిని గాయపరుస్తుందోనని
నీ శకటం దిగి
దారినున్న కంటకాన్ని తొలగించి
ముందుకుసాగిన అల్ప మిత్రుత్వం

గాయపడని పధికుడి చల్లని చూపులు
నీ వెంటున్నా ఆశీస్సులు
నడుస్తున్న బాటలో ప్రతివ్యక్తి
ముఖంలోకి చూస్తూ
రమేశ్ అని పిలిచేటప్పటికి
నా వేపుచూసి
ఎందుకు ఏడుస్తున్నావన్నాడు
------ సి.వి. కృష్ణారావు 4 కామెంట్‌లు

సంపత్కుమార సంస్కృతి


అదుగో మనకళ్ళముండే మెదుల్తున్నాడు. చలువచేసిన తెల్లని లాల్చీ, ధోవతీ విశ్వవిద్యాలయం ఆచార్య పదవి అదిష్టించిన విద్యావేత్త ఠీవితోలేడు. ఇప్పుడు కేకేస్తే వినపడనంతటి దూరానికి పయనిస్తున్నాడు.
నెలనెలా వెన్నెల సభ్యులను ప్రేమించి, వారితో సాంగత్యాన్ని పెంచుకొన్న ఒక పండితుడూ, కవీ, విమర్శకుడైన కోవెల సంపత్కుమారాచార్య 11 ఆగష్టు 2010న మమ్మల్ని విడిచిపోయారన్న బాధ ఇప్పట్లో తరిగేది కాదు.
ఆయన వరంగల్లు కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసరుగా వున్నంతకాలం (1993 జూన్ నెలాఖరున) పదవీ విరమణ చేసిన తరువాత సాహితీ వ్యాసాంగంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాడు.
ఎక్కడ సాహిత్యగోష్టిలో కూర్చున్నా, విషయాన్ని లోతుగా తరచి చూసే సంపత్కుమార అభిప్రాయం కోసం శ్రోతలు ఉత్సుకతో ఉండేవారు. ఆయన విశ్లేషణ అత్యంత విలువైనదిగా వుండేది.
సంపత్కుమార రచనలు చాలా వున్నవి. గాధా సప్తాశతి లో కొన్నిటిని మధుర గాధలుగా వెలువరించాడు. యతీంద్రావ్యాజ రామానుజా అనే మకుటంతో ఒక ప్రౌఢ శతకం రచించాడు. ప్రణ కవితా రధ్య అలే శీర్షికతో కృష్ణ శాస్త్రి, నాయల్ర్, వేదుల, రాయప్రోలు, విశ్వనాధుల కవిత్వంపై స్రవంతి పత్రికలో (1957-58) వ్యాసాలు రాశాడు.
సాంప్రదాయిక కావ్య శాత్ర పాండిత్యంతో పాటు ఆధునిక సాహిత్యంలో లోతైన ప్రవేశమున్న సాహిత్యవేత్త.
ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన చందస్సుపై చేసిన కృషి ఇంకో ఎత్తు. చేకూరు రమారావు గారంటారు : ఆంధ్ర చందస్సంప్రదాయంపై సాధికారంగా మాట్లడగలిగిన ఒకే ఒక పెద్ద దిక్కు ఆయన.
సంపత్కుమారకూ, చే.రా.కు రా.కు వచన కవిత్వంపై చాలా కాలం చంధో వివాదం జరిగింది. అది సాహిత్యాభిమానులు చాలా ఆతురతతో గమనించేచారు. అయితే ఇంత వాడిగా జరిగినా వ్యక్తి దూషణలు లేకుండా విషయప్రధానంగా జరిగిన చర్చ అప్పటికీ ఇప్పటికీ ఆదర్శమైన సాహిత్య చర్చగా నిలిచిపోయింది.
వచన పద్యం లక్షణ చర్చ అన్న పేరుతో వీరిరువురి రచన నాయని సుబ్బారావు గారికంకితమిచ్చారు. తరువాత రాజమండ్రిలో జరిగిన సాహిత్య గోష్టిలో తెలుగు చందస్సు పై కొత్తవెలుగు అన్న వ్యాసం ప్రచురించారు.
కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య ఇతర మిత్రులు కలిసి చేతనావర్తనం సంపుటాలు ప్రచురించారు. ఒక సంపుటి సిద్ధాంత ప్రవచనం మాత్రమే కాకుండా ఒక కవిత కూడా వ్రాశారు.
ఏ మార్గంమీదనైనా, పూర్వ ఆధునిక కావ్యాల రెండింటినీ సమాన గౌరవంతో పరిశీలించి కొత్తవెలుగుల్ని అందించారు. ఇంత త్వరలో మనల్ని విడిచి పోవటంవల్ల ఎన్నో నూతన భావావిష్కరణకు మనం కొరత పడ్డవారమైనాము.


సి.వి. కృష్ణారావు
నెలనెలావెన్నెల 0 కామెంట్‌లు

నెల నెలనెలా వెన్నెల సమావేశము

0 కామెంట్‌లు

నెల నెలనెలా వెన్నెల ౩౦౨వ సమావేశము

హైదరాబాద్ లో ఎడతెరిపిలేకుండా రోజంతా వర్షం కురుస్తూనే వుంది.

శ్రీ ధర్మాచారి
శ్రీ రఘు
శ్రీ కే. వి. రామా నాయుడు
శ్రీమతి పార్వతి మోహన్ సమావేశములో పాల్గొన్నారు.

తమ తమ స్వీయ కవితలు చదివారు

౫వ సంకలనము తేవాలనే ఆలోచన కార్యరుపానికై ఎమిసెయ్యాలనే విషయాన్ని చర్చించారు
త్వరలో సంకలనాన్ని తేవడానికి పనిచెయ్యాలని అందుకు రాని మిత్రులతో మాట్లాడాలని నిర్ణయించారు.


నెలనెలా వెన్నెల మిత్రులు ఈ బ్లాగు చుస్తున్నాట్లయితే స్పందించగలరు





............౧౭౦౪.1704...... 1 కామెంట్‌లు

ఈ నెలసమావేశము ౨౫.౭.౨౦౧౦


0 కామెంట్‌లు

ఈ సమావేశం 301వది.

నెలనెలా వెన్నెల ప్రారంభించినప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ సమావేశం 301వది.

పదం పాటైనప్పుడు అది పిల్లకాలువై, సెలయేరై, నదిగా మారి లోతుగా ప్రవహిస్తూ, తీరాలను ఆదరిని ఈ దరిని కలుపుతూ సాగిపోతుంటుంది. అలాంటి నదీప్రవాహంగా సాగిన సాయంకాలం, 27.6.2010.
నదిని తలపోస్తూ వచ్చిన వారిని పాటల నదిలో మునకలేయించారు శ్రీ అందెశ్రీ తనపాటలతో. మనిషి మనిషిగా కనుమరుగైపోతున్న తనాన్ని గుర్తుచేసారు.
శ్రీ ధర్మాచార్యులు
శ్రీ నాగార్జున
శ్రీ రఘు
శ్రీ నిషాపతి
శ్రీ రఘు
శ్రీ కె.వి. రామనాయుడు
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీమతి పార్వతిమోహన్ హాజరైనారు 0 కామెంట్‌లు

జారిన శిథిలాలు

పసిపిల్ల పొత్తికడుపున
ముసల్ది మంచాన
యాద మర్చిన క్షణాన
విపత్తు

ఎదురైన చీకట్లోకి
ఆర్తనాదాలుతప్ప అండలేక
అందుకునే చేతుల్లేక
వేలాది జనం
వందలాది గ్రామాలు
మాయమైన దారులమీద
పరుగులు
చెట్టుకూలింది
గూడు చెదిరింది
పిట్టలు పుల్లకోసం
తిరుగుతున్నయి

అనాదికాలపు జనకథ మొదలు
బతుకు మళ్ళా మొదటికి
కృష్ణా తుంగభద్రలు పొంగినయి
సూర్యుడు పడమట వుదయించాడు

వెటకారం
నిశ్శబ్దం
వెలుగులేనిదారి
గొంతులేనిఘోష
చిదిమిన ప్రాణం
నేల చచ్చిపోయింది

రేపులేదు 0 కామెంట్‌లు

జూన్ నెల సమావేశము

0 కామెంట్‌లు

వర్ణాల దూరాన నా చెల్లి


కవిత్వం గుండెలో గులాబీ పరిమళిస్తుంది
బాధను మరిపించి మనస్సును ఆదరిస్తుంది
ఒక వీరుని విజయకేతనమవుతుంది
కవిత్వమొక్కటే కల్మషాన్ని కడిగేస్తుంది

అయిదు అడుగుల దూరం
అయిదు ఆమడల దూరం
అయిదు వర్ణాల దూరం
ఉంటేనేం


మతిచెరగని మనసు వదలని
నా కవల చెల్లీ
నిన్ను కౌగలించుకుంటాను


అణువణువూపొంగి
ఆత్మీయుణ్ణవుతాను


కవిత నా కన్నీటి చుక్క
ఆనంద భాష్పం
అందులో అందాల బొమ్మవు నీవే


.. వార్త 29.3.2004

0 కామెంట్‌లు

నెలనెలా వెన్నెల ఈ నెల సమావేశము

నెలనెలా వెన్నెల ఈ నెల సమావేశము 30.5.2010న జరిగింది.
శ్రీ జాన్ హైడ్ కనుమూరి, శ్రీ ధర్మాచారి, శ్రీ కె.వి. రమానాయుడు, శ్రీమతి పార్వతీమోహన్ పాల్గొన్నారు.

సంకలనంకోసం వచ్చిన కవితలు, రాని వాటిని ఎలా సేకరించాలి అనే విషయం చర్చకు వచ్చింది.

నెలనెలా వెన్నెల మిత్రులు ఈ బ్లాగుచూస్తున్నట్లయితే స్పందించి మీ కవితలను పంపగలరు. 2 కామెంట్‌లు

నెల నేలా వెన్నెల సమావేశము

0 కామెంట్‌లు

నెలనెలా వెన్నెల సమవేశము 25.౪.౨౦౧౦ ఫోటోలు

25.4.2010 సాయంత్రం నెలనెలా వెన్నెల సమావేశము బాగా జరిగింది. మోహన్ రెడ్డి గారు వీడియో తీసారు.
యాకూబ్ గారు ఇది శ్రీశ్రీ స్మారక సభ అన్నారు.ఆయన శ్రీశ్రీ రాసిన పతితులార భ్రస్టులార పాట పాడారు.
జగన్ పాడవోయి భారతీయుడా అని పాడారు.
శిలాలొలిత ,రేణుక అయోల,,వీరయ్య, ధర్మా చారి,పార్వతిమూహన్ , యం.స్.నాయుడు,
క్రిష్ణారావు గార్లు కవితా గానం చేసారు. శ్యామల, ప్రసాద్ గారు, శ్రీనివాస రావు, రాములు పాల్గొన్నారు.


















పార్వతి మొహన్ 4 కామెంట్‌లు

దళిత నిబద్ధ దార్శనికత - డా. సుమనశ్రీ





సి.వి.కృష్ణారావుగారు అప్పుడూ ఇప్పుడూ దళితకవే. ఆనాడూ ఈ నాడూ కమ్యూనిష్టే. విద్యార్థి దశలో మార్కిష్టు బీజాలు పట్టుకుని, జైల్లో వున్న వారం పదిరోజుల్లోనే అధికారం పడగనీడని పసిగట్టి జరుగుతున్న దోపిడినీ, దుర్మార్గాన్నీ అర్థంచేసుకున్నారు. కాబట్టి ఒక్క కవిత్వంలోనేకాదు, జీవితంలోనూ మార్కిష్టుగానే ఊపిరి పీలుస్తున్నారు. దళిత ప్రజాకవిగానే కవిత్వం వ్రాస్తున్నారు.

సి.వి.కృష్ణారావుగార్ని తల్చుకున్నప్పుడల్లా “I am large … I contain multitudes” అంటూ ఆశ్చర్యపరిచే అమెరికన్‌ మహాకవి వాల్ట్‌ విట్మన్‌ బానిసత్వంపై 18855లోనే తన కావ్యం “లీవ్స్‌ ఆఫ్‌ గ్రాస్‌”లో తన ఆగ్రహాన్ని ప్రకటించాడు. నీగ్రోలపై తెల్లజాతి దౌర్జన్యాన్ని నిరసించాడు. “సాంగ్‌ ఆఫ్‌ మైసెల్స్‌ “అనే సుదీర్ఘ కవితలో” గాయపడ్డవాణ్ణి ఎలావున్నావని ప్రశ్నించను, నేను గాయపడ్డ వాణ్ణవుతాను అంటున్నాడు విట్మన్‌. కృష్ణారావుగారు అంతే విట్మన్‌ హృదయంలో ఎంతమందికి చోటుందో కృష్ణారావుగారి హృదయంలోనూ అంతమందికి చోటుంది. భూమ్మీద నడుస్తున్న మానవత్వంలా కనిపిస్తారాయన. ఖచ్చితమైన సామాజిక అవగాహన వుండి, విప్లవాత్మకమైన హృదయంతో ద్వేష, అసూయల్ని ఆమడదూరంలోనే ఉంచారాయన. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కవిత్వం ఎక్కడున్నా, ఎలాగున్నా భుజం తట్టడం తన బాధ్యతగా “నెలనెలా వెన్నెల” నిర్వహిస్తున్నారాయాయన. ఎంతమందితో ఎలా తిరుగుతున్నా హృదయంనిండా దళితుల గురించిన వైతరణి వొడ్డున నివసితున్న దళితుల గురించిన ఆలోచనే. మురికిపేటల్లో ఊపిరిపీలుస్తున్న అభాగ్యుల గురించే ఆవేదన.

1968లో ఫ్రీవర్స్‌ ఫ్రంట్ తరుఫున కుందుర్తి పీఠికతో వెలువడ్డ వైతరణి కావ్యం కృష్ణారావుగార్ని అభ్యుదయదళిత కవిగా లోకం ముందుకు తెచ్చింది. వృత్తిరీత్యానే కాదు, ప్రవృత్తిరీత్యా కూడా కృష్ణారావు గారి హృదయం ఎప్పుడూ దళితుల జీవితాన్నే తన కళ్ళముందుంచుకుంది. దళితులలో ఎక్కువ మంది తరతరాలుగా దరిద్రంలో బతుకీడుస్తున్నవాళ్ళే. గుడిసెలలో నివసిస్తూ మురికి నీటి దుర్గంధం ?ఊపిరి పీలుస్తున్నవాళ్ళే. కుళ్ళుకాలవనే నరకలోకపు వైతరిణిగా కృష్ణారావుగారు గుర్తించారు. మురికిపేటలో మసలే మూగజీవాల బాధల్ని ఎంత దగ్గరగానో పరిశీలిస్తే తప్ప “వైతరణి” లాంటి కావ్యం రూపు దిద్దుకోదు. ఈ కావ్యంలో ఉన్న పదహారు కవితలలోనూ వస్తువు నరక సదృశ్యమైన దళిత జీవితమే. కవితలన్నీ ఒకే వస్తువు చుట్టూ నిర్మింపబటంతో పాఠకులపై బలమైన ముద్ర వేస్తుంది ఈ కావ్యం.

యమలోకం త్రోవలో వైతరణి

మురికిపేట మలుపులో

ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ

అన్న వాక్యాలతో వైతరణి అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. ఆ వైతరణి ఒడ్డున ఉన్నవాళ్ళు ఎవరంటే

“వైతరణి ఒడ్డున బాధకు చిహ్నాలై

సుప్రసిద్ద గాధలకు గాయకులై

ఒకడు గుఃహుడు

ఒకడు చెప్పులు కుట్టేవాడు

ఒకడు అంధుడు ఒకడు బంధువు”అని సమాధానం చెబుతారు. “మహాగుహులు” అన్న కవితలో రకరకాల వృత్తులతో జీవనం సాగిస్తున్న వాళ్ళని వర్ణిస్తారు.

“మానవులు మాలిన్యం చేసే చోట్లను

ఓర్పు చీపుర్లతో తుడిచినవారు”

“ముళ్ళను గులకరాళ్ళను

నెత్తురు కళ్ళయిచూసే

పాదాలకు చెప్పులు కుట్టినవారు”

“నాగజెముడు బొంతలా

నలుగురు ఏవగించుకున్న ముదుసలికి

తలకొరువులు పెట్టేవారు”

ఈ వృత్తులన్నీ బానిసవృత్తులే. ఈ వృత్తులలో అవమానం ఎక్కువ. కష్టం ఎక్కువే కానీ సంపాదన మాత్రం బహుస్వల్పం. అందుకే ఇంటినిండా దుర్భరమైన దారిద్ర్యం.

“దేహానికి కాపుంచను

ఒక పేలిక అసలుండదు”

“జుట్టుకు పట్టించుకోను

నూనెబొట్టు నిలవుండదు”

“రెక్కలు డొక్కలోకి నెట్టి

ఒక్కొక్కరకం అలమటిస్తుంటే

రేపన్నది ఘోషించదు”

1969లోనే కృష్ణారావుగారు “కళ్ళు తెరిచిచూడు” అన్న కవితలో

బలిపీఠంమీద మెడపెట్టిన బాలకుడా

పులిపంజా ముందున్న మానవుడా

నీ బవిష్యత్తు చీకట్లో దాగున్నది

కళ్ళుతెరిచి చూడు కనిపిస్తున్నది”

అంటూ దళితుల్ని హెచ్చరించే వున్నారు. దళితులు ఒక సంఘటన శక్తిగా రూపొందవలసిన అవసరాన్ని ఆనాడే నొక్కి పలికారు.

1969లో సృజన ప్రచురణగా వెలువడిన “మాదీ మీ ఊరే” సంకలనం కూడా కృష్ణారావుగారిని

దళితుల పక్షాన్నే నిలిపింది.

“మాదీ మీ వూరే మహరాజ కుమారా

గోచీకి పేలిక లేక గుడిసెల గుంపుల్లో

పెరిగిన బాలురలో ఒకణ్ణి

చిన్నబాబు పోతుంటే

త్రోవలో నీవెందుకని

తరిమికొట్టబడి తూలనాడబడిన తెరువరిని”

అని ఊరు చూడవచ్చిన వొకప్పటి రాజుగార్ని ఎగతాళి చేస్తున్నాడు దళితుడుఈ సంకలనంలోని చివరి ప్రస్తావన “రేపు”లో ఏమంటున్నారో చూడండి.

“వేలుపెట్టి చూపించి

తుపాకి కాల్చడానికి బుల్స్‌ఐ యింకా అమర్చబడలేదు

అమర్చబడినా తుపాకులు రెడీగాలేవు

తుపాకులుంటే వ్రేళ్ళకు వాడకం తెలీదు

అందుకనే ఇది మహచ్చాతి కాలం

ఈ మహచ్చాతి కాలంలో

ఒక ప్రథమాంకం ప్రద్ర్శనమౌతున్నది

అశ్వారూఢుడు కిందపడగానే

అనామకుడు అంకెంలో కాలుపెట్టి

కళ్ళెం చేత్తోపట్టుకుని గేలప్‌ చేస్తున్నాడు”

పై వాక్యాలలో ముందుచూపు తెలుస్తూనే ఉంది.

మార్క్సిజం, అంబేద్కరిజంల వెలుగులో తమ రాజ్యాన్ని తాము దక్కించుకోవడానికి ద్ళితులు సాయుధులవటం మనం చూస్తూనే ఉన్నాం. 1991లో వెలువరించిన “అవిశ్రాంతం” కవితా సంపుటిలోలి “అగ్రగామి అంబేద్కర్‌” అన్న కవితలో కూడా ఈ విషయాన్నే స్పష్టపరుస్తున్నారు కృష్ణారావుగారు. రాబోయే యుగం దళితులదేనని నమ్మబలుకుతున్నారు.

అగ్రహావేశ అభ్యుదయ పోరాట కవిత్వంలో సూటిదనం ముఖ్యం. కృష్ణారావుగారి కవిత్వం చదువుతున్నంతసేపూ సింబల్సు గురించికానీ, పదచిత్రాల గురించికానీ, శిల్పం గురించి కానీ మనకి ఆలోచన రాదు. వస్తువుతోనే హృదయాల్ని కదిలించే ఇలంటి కవిత్వంలో వస్తువుని ఆశ్రయించిన భావమే శిల్పం. మనసుని సూటిగా తాకే భాషే పదచిత్రం. దళితుల జీవనవేదనే ఈ కవిత్వానికి ప్రతీక!

ఉదయం 28.11.1994 నుంచి 0 కామెంట్‌లు

అగ్రగామి అంబేద్కర్‌




పుడమితల్లికి పురుడుపోసి
గోమాత పొదుగు కడిగి
ఇంటికప్పుకు రెల్లుకప్పి
డొక్కకు రెక్కలు కలిపిన
స్పర్శకు అస్పృశ్యత ఫలసాయం
విస్తరి నుండి ఊడిన ఆకులా ?
నావ్ కుదురు నుంచి విరిగిన బద్దలా ?
పాలపుంత నుంచి రాలిన చుక్కలా ?


"ఏడవకు
బైటికిరా,
రాజ్యాలేలంటే
కళ్ళప్పగించి ఏం లాభం ?
పద ఐదో తమ్ముడిగా కాదు
అగ్రగామిగా"
అదుగో
ఎవరో వెల్తురు మోసుకుంటూ వస్తున్నారు
వెలుగు తన కక్కర్లేదా ఏం?
జన సమూహానికి దారి చూపుతున్నాడు
ఆయనే అగ్రగామిగా ఉండి
అవస్థల వ్యవస్థలు దాటుతూ...
ఇంకా సిద్దించని కోర్కల బి.ఆర్‌. అంబేద్కర్‌



సివి. కృష్ణారావు ..... అవిశ్రాంతం నుంచి 3 కామెంట్‌లు

కన్నీటి కుండల్ని మోస్తున్న కవి

వైతరణి నుంచి రస్తూ రాస్తూ


ఎక్కడో ఎప్పుడో ఏక్షణాన్నో కొందరి మనసులు గాయపడతాయి. బహుశా అందరిమనసులు గాయపడతాయి, కానీ చాలా మంది గాయాలు మానవు. కొంతమంది గాయాలు మానవు. కొంతమంది మానని తన గాయాలతో ఇతరులకు గాయాలు చేస్తారు. ఈ క్రమంలో కవులయిన వాళ్ళని సౌందర్యం, దరిద్రం, ఉద్యమాలు, విప్లవాలు వగైరాలు ఆకర్షిస్తాయి. వాటితొ తమని తాము ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సమన్వయం కుదిరిన వాళ్ళు స్రవంతిలో కలుస్తారు. కాలేని వాళ్ళు ఒంటరిద్వీపాలుగా మిగిలిపోతారు.


"వైతరిణి నుంచి రాస్తూ రాస్తూ" అన్న ఈ గ్రంధంలో సి.వి.కృష్ణారావుగారి వైతరణి, మాదీ మీవూరే, అవిశ్రాంతం, కిల్లారి, రాస్తూ రాస్తూ అన్న ఐదు కవితాసంపుటాలు ఉన్నాయిలు. వైతరణి, మాదీ మీ ఊరే అన్న సంపుటాలు అభ్యుదయ భావజాలంతో నిండినవి..


మాదీ మీ ఊరే'కి కృష్ణారావుగారు రాసుకున్న ముందుమాట చదివితే ఆయన నిస్సహాయ ఆక్రోశం మనకు కనిపిస్తుంది.


అశ్వారూఢుడు క్రిందపడగానే అనామకుడు అంకెంలో కాలుపెట్టి కళ్ళెం చేత్తో పట్టుకొని గేలప్‌ చేస్తున్నాడు. నావ దొరక్కపోతే కళ్ళెం పొత్తికడుపుకు కట్టుకొని ఒడ్దున ఉన్న వాళ్ళందర్నీ వెక్కిరిస్తూ దుఖఃవారథి దాటఛానికి వీపు దొరకక తన పెదిమను మునివేళ్ళతో మీటుతున్నాడు.


అనామకుణ్ణీ, దిగంబరినీ, క్షుదార్తుణ్ణీ అయిన నేను నా అనుంగు సోదరులకు రత్నకిరీటాలు చేయాలనీ, విరిగిపోయిన వాళ్ళ వేళ్ళకు అంగుళీకాలు చేయాలనీ వారి గాధల ప్రథమాంకం నా రచన అనీ చెప్పుకున్నారు.


కోలుకోలేనితనాన్ని ప్రేమించేవాళ్ళు స్వకీయ విలక్షణ ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. వాళ్ళు కవులయితే, సుకుమారులయితే వాళ్ళ భాధ కూడా విచిత్రాన్ని పులుముకుంటుంది. నిరాశకు మారు పేరయిన నిహిలిజం వాళ్ళు పిలవకున్నా వాళ్ళని వెంబడిస్తుంది. అన్నింటి పట్లా ఆయన నమ్మకం ఒక ఆకర్షణని అదనంగాఅ అందిస్తుంది. అది అన్నీ కోల్పోయిన వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది. తమాషా ఏమిటంటే ప్రపంచయుద్ధ బీభత్సాలకు మనసు పాశ్చాత్యకవుల ప్రతిభా శకలాలతో పోల్చదగిన అధునాతన అభివ్యక్తిని నలబై ఏళ్ళ క్రితమే సాధించిన కృష్ణారావు గారు అధోజగత్‌ సహోదరుల్తో ఆత్మీకంగా ఏకంకావలని ప్రయత్నించడమే. ఒకే కవితలో అధివాస్తవిక అభివ్యక్తి దానికి లొంగని జీవన వాస్తవికత ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది.


"అనుక్షణం అతి సున్నితమైన దారానికి


వ్రేలాడుతుంటుంది ప్రాణం


అద్దంలో ముఖం చూసుకుంటే


అప్పుడప్పుడూ వక్రించి ఉంటుంది


ఫలానా రోజున సూర్యుడు పొడమడనీ


నక్షత్రాలు పొగడపూలలా రాలిపోతవనీ


అల్లకల్లోలం ఆక్రమించుకుంటుందనీ


ఒక వుద్రేకం అప్పుడప్పుడు


ఆవిష్కరింపబడుతుంది.


అద్దెయింటి కిరాయి దగ్గర


దుకాణం సరుకల దగ్గర


అలవాట్ల అంగిట్లోపట్టే పడిశం దగ్గర


పరువునిద్రించే తెరమరుగున


వుమ్మిలో బడ్డ యీగలాగా


మనస్సుకు సంకెళ్ళుపడుతై (88పేజి)


కృష్ణారావు గారి అభివ్యక్తిలో ఆధునిక, ఆధునికానంతర ధోరణులు ఉన్నాయి. కానీ ఎక్కడా జీవితం పట్ల ఆఆశ, నమ్మకం లేవు.


'ఆలయాల్ని శిథిలాలు చేసి వాటిలో విగ్రహాలు వెతకడం'వంటి విధ్వంస ఆకర్షణలు అవిశ్రాంతం సంపుటిలో కనిపిస్తాయి. తన అస్తిత్వాన్ని విస్మరించి జనంలో కలవాలన్న తపనా ఈ సంపుటిలో కనిపిస్తుంది. తన ఒంటరి స్తంభంలోని ఆలోచనల్ని ఆయన గుర్తించినట్టు కూడా తెలుస్తుంది.


'నా' అనే కవితలో 'నీ'ను విస్మరించి నలుగురిలో నలుసుగా మెలుగు


ఒక్క గజం కొలుస్తూ ఏకాకివి కాకు


అందరితో ఒకేసారి రోదించు


ఒకేస్వరంతో స్పందించు


భుజం భుజం కలిపి సంఘర్షించు' అంటారు.


ప్రపంచంలో విషాదమేకాదు, ఆనందం కూడా ఉంది. కానీ కృష్ణారావుగారి లాంటి సున్నిత సుకుమార భావుకులు కొమ్మనించి రాలుతున్న పువ్వులోనూ మానవ జాతి సామూహిక మరణ్ దృశ్యాన్ని చూస్తారు. భయం అన్నది వారి బాధలో కలిసిపోయింది. కన్నీళ్ళు కార్చిన నేత్రాలు ఆనందబాష్పాలు కూడా రాలుస్తాయన్న సత్యాన్ని కృష్ణారావుగారు అంగీకరించరు. పాక్షిక ప్రదర్శన చేసే పరివేదనా పార్శ్వాన్నే ఇష్టపడతారు.


కృష్ణారావుగారు ఆధునికులేకాదు, అత్యాధునికులు కూడా. కృష్ణారావుగారి కవిత్వం బండబారిన, చలనంలేని చైతన్యంలోని మనసుక్ని ఛేదిస్తుంది. జీవితమంతా హాయిగా వుందాలనుకునే వాళ్ళు, ఒక సాంప్రదాయాన్ని భుజాన వేసుకున్నవాళ్ళు, పీఠాధిపతుల బీటలు వారేలా చేసే అధునాతన అణు విస్పోటనలు కృష్ణారావుగారి కవితలు. కానీ నమ్మకం లేకపోవడం అన్నికన్నా విషాదం. నమ్మకం లేకపోసే విషాదం నిషాగా మరుతుంది .. గిల్బర్ట్‌ అన్నట్లు...


Heavy the sorrow that bows the head where love is alive and hope is dead.




సౌభాగ్య


ఆంధ్రప్రభ 10.1.1999 నుంచి




(ప్రచురణ : 1997, రచన: సి.వి కృష్ణారావు, పేజీలు :268, వెల 50/-రూపాయలు ,


పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ, విశాలాంద్ర, హైదరాబాద్‌ 500 001.

0 కామెంట్‌లు

అరుదైన సాహితీ సేవ


సమకాలీన సాహిత్య, సామాజిక సేవా రంగాల్లో చెరిగిపోని అడుగుజాడలు సృష్టించిన సాహితీవేత్త కృష్ణారావు

శరత్కాల సాయం సంధ్య పున్నాగ పూల పరిమళాలతో గాలులు తెరలు కడుతున్నాయి. నగరాకాశం మీద చంద్రుడుదయిస్తున్నాడు. హోటల్వైస్రాయ్కాన్ఫరెన్స్హాల్లో డాక్టర్రామినేని ఫౌండేషన్పురస్కార సభ. హాలంతా డాక్టర్ కె.ఆర్‌. సూర్యనారాయణ వీణానాదంతో పులకిస్తోంది. పురస్కారాలందుకున్న వాళ్ళలో సి.వి. కృష్ణారావు కూడా ఉండడం ఆనాటి ఆనందానికి మరింత వన్నె తెచ్చింది.

సి.వి.కృష్ణారావు(1926) జీవితకాలపు కృషి కేవలం సాహిత్యానికి మాత్రమే పరిమితమయింది కాదు. ఆయన జీవితం పేదవాళ్ళకూ, తరతరాలుగా సాంఘికంగా అణగారుతూ వస్తున్న వాళ్ళకూ ఒక ఓదార్పుగా, ఒక వాగ్దానంగా, ఒక బాసటగా ఉంటూ వచ్చింది. ఆయన విద్యార్థి రోజుల్లో నిషేధిత సోషలిష్టు పార్టీ తరపున అరెస్టయి జైలుకు వెళ్ళినవారు. దాసరి నాగభూషణరావు దగ్గర కమ్యూనిష్టు పాఠాలు నేర్చుకున్నవారు. సాంఘిక సంక్షేమ శాఖలో సాంఘిక సేవా కార్యకర్తగా అదిలాబాదునుంచి తూర్పు గోదావరి మన్యసీమల దాకా ఆయన చూడని దళితవాడ, అడుగుపెట్టని గిరిజన గూడెం లేవంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటికి పాతికేళ్ళూ పైబడ్డ మాటే. తూర్పుగోదావరి జిల్లాలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్అధికారిగా ఆయన మా గిరిజన గ్రామాలకి వచ్చారు. మా పల్లెల్లో సాధారణ రెవెన్యూ ఉద్యోగులు కూడా ఎంతో అధికార ధర్పం ప్రదర్శించే రోజుల్లో ఆయన ఆదివాసుల్ని పేరు పేరునా పలకరిస్తూ వాళ్ళతో అడవి అంచుల్లో పొలం గట్లమీద కలిసి నడుస్తుండేవారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూలు కులాలు, షెడ్యూల్తెగల అభివృద్ధికి, సంక్షేమానికీ కొత్తదారులు వేసిన తొలితరం కార్యకర్త. ఆయన. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు అలిఖిత ఒరవడి ఆయనదే. అందుకనే జి. ఫణికూమార్తన గోదావరి గాధలకు పరిచయంకోసం కృష్ణారావును అభ్యర్థించారు.

ఉద్యోగ, వైయక్తిక, సృజనాత్మక జీవితాలు వేరు వేరు పరిధిల్లో సంచరించే మనుషుల మధ్య కృష్ణారావు లాగా తన అన్ని వ్యాసాంగాలకూ కేంద్రాన్నొకటిగానే ఉంచుకొనేవాళ్ళు అరుదు. ఆయనకు హరిజనులతో సాంగత్య, సామీప్యం కేవలం ఉద్యోగ జీవితానికే పరిమితం కాలేదు. బహుశా జాషువా తరువాత, సామాజిక అసమ్మతి స్వరాన్ని అంత బలంగా సమాజం ఎదుట లేవనెత్తింది కృష్ణారావు అనొచ్చు. అందుకు సజీవ సాక్ష్యం వైతరిణి(1968) కావ్యం. అది కావడానికి 16 కవితల చిన్న కావ్యమే అయినా వస్తువులో, అభివ్యక్తిలో అది నిస్సందేహంగా అభ్యుదయానంతర యుగానికి మేలుకొలుపు. అత్యంత సరళమైన, నిష్కపటమైన, ప్రజాస్వామిక సంస్కృతిలో కూడిన రచన అది. 'మానవులు మాలిన్యం చేసే చోట్లను ఒర్పుల చీపుర్లతో తుడిచిన' రచన అది. తిరిగి తొంబైల్లో దళిత కవిత్వం ప్రధాన సాహిత్య చైతన్యాన్ని ఆకట్టుకునే దాకా అటువంటి రచన తెలుగులో రాలేదనే చెప్పాలి. యథార్థినికి మాదీ మీ ఊరే (1959) ఆయన మొదటి ప్రచురణ అయినా, ఒక ఏడాది ముందే వైతరిణి తన మనసులో రూపుదిద్దుకుంటూ ఉండేదని ఆయన ఒకసారి అన్నారు..

మధ్యలో అవిశ్రాంతం (1991) తరువాత ఆయన వెలువరించిన కిల్లారి (1996) ఆధినికానంతర యుగానికి వేకువ కేక. ఇంకా తెలుగు కవిత్వం ఆధునిక నిర్మాణాల్ని చూడలేకపోతున్న సమయంలో ఆయన కవిత్వాభివ్యక్తిలో మౌలిక పరివర్తనను తీసుకువచ్చారు. తన కాలం కన్నా ముందుండగలగడానికి ప్రథాన అర్హత తన హృదయమెప్పుడూ జ్వలిస్తుండడమే.. హృదయ ప్రజ్వలనానికి కిల్లారి కావ్యంలో ప్రతీ పంక్తీ సాక్ష్యమిస్తుంది. అంతే కాదు, అది తన ఇంట్లో నీడపట్టున కూర్చొని , భూకంపంవల్ల నిర్వాసితులైన అక్కడి కుటుంబాలకు తన హృదయాన్ని ఊతమిచ్చి రాసిన కవిత. అందుకే డాక్టర్సుమనశ్రీ 'నీ ఆదర్శాలు నా కనవసరం, నీ ఆచరణని చూపమంటుంది ఉత్తరాధునికత'అని రాశారు. మాటలు రాయడానికి స్ఫూర్తి కృష్ణారావే అని నేననుకుంటాను.

బాధ్య కలిగిన అధికారిగా, వచన మార్గానికి చెందిన ప్రజాకవిగా కృష్ణారావు అందించిన సేవలకన్నా మరెంతో అమూల్యమైన సేవ ఆయన గత ఇరవయ్యేళ్ళుగా నెలనెలావెన్నెలద్వారా సాగిస్తున్న కృషి, 1982నుంచి నేటిదాకా ప్రతినెలా చివరి ఆదివారం ఆయన ఇంట్లో కొందరు సాహిత్యాభిమానులు జమకూరుతున్నారు. వాళ్ళందరికి తమ తమ కొత్త కవితల్ని అక్కడ చదివి వినిపించడమే అజెండా. సైద్ధాంతిక నిబద్ధత కన్నా తన అనుభూతికీ, తన బుద్ది వ్యాపారానికీ లొంగకుండా తన హృదయాన్ని చీల్చుకొని పైకొచ్చే అభివృద్ధికే ప్రధాన్యాన్నివ్వాలకునే కవులకు నెలనెలా వెన్నెల ఒక మద్దతు. అలా కృష్ణారావు నిబద్దుడని కాదు. ఆయన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు "కళాత్మక వ్యాసాంగానికి సంఘజీవితంలో ఉన్న రక్తమాంసాల్ని పంచుకోవడంలో అవినాభావ సంబంధం ఉంది. లేకపోతే ఉత్త సాహిత్య వ్యాసాంగం నరంలేని వేలు".

ఇక్కడ చూడాల్సింది కృష్ణారావు నిబద్ధతను వదులుకోకుండానే సాహిత్య విలువల కోసం ప్రయత్నిస్తుండటం. నిబద్ధతను యాత్రికంగా విధించడంగానీ లేదా అంగీకరించడం గానీ రెండూ జీవితాన్ని, మానవ సంబంధాల్నీరుకున పెడతాయి. ముఖ్యంగా సృజనాత్మక వ్యాసాంగాన్ని అవి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాకాక సృజనాత్మక కృత్యాద్యవస్థలో మనం సాధకుడి వెంట ఉండి అతని స్ఫూర్తినిస్తున్న దర్శనమేదో తనదైన పద్దతిలో తాను వ్యక్తీకరించగలిగే విధంగా అతనికొక అవకాశాన్ని వదిలామనుకోండి అప్పుడతనొక అడుగు ముందుకు వెయ్యగలుగుతాడు. తాను దేనికి నిబద్దుడిగా ఉండాలో తానే ఎంచుకోగలడు. పిట్టలు రెక్కలొచ్చి తమ దోవన తాము ఎగిరి పోయేదాకా నీడానిచ్చే వెచ్చనిగూడులా, ఒక లాంచింగ్పాడ్లా ఎందరో యువ కవులకు నెలనెలా వెన్నెల ఉపకరించిందనడం ఒక సాహిత్య యథార్థం.

నెలనెలా వెన్నెల గురించి కృష్ణారావుకున్న స్పష్టత ఆయన మాటల్లోనే చూడొచ్చు "నెలనెలా వెన్నెల్లో ఎవరి వ్యక్తిత్వవికాసం వారిది. సభ్యత్వం లేదు, చందాలు లేవు, ఇందులో పాల్గొనేవారందరూ వర్తమాన యుగ స్పందన గలవారే. ప్రచారంతో సంబంధం లేకుండా కవిత్వాకర్షణే ధ్యేయంగా పెట్టుకుని ఇక్కడకు వస్తారు. ఇంకో ధ్యాస ఏదీ లేదు. అత్యాధునిక కవితా వ్యాసంగం, కవితా చర్చ నేటి ప్రముఖ విషయాలు, చిన్నపిల్లల దగ్గరనుంచి ఇప్పటికే పేరొచ్చిన కవుల వరకూ నెలనెలా వెన్నెల ఒక కలయిక క్షేత్రంగా ఉంది" అన్నారాయన. నేనిప్పటికీ గిరిజన ప్రాంతానికి వెళ్ళినా కృష్ణారావు అడుగు జాడల్ని పోల్చుకుంటూనే ఉంటాను. అడుగు జాడలు సమకాలీన సాహిత్య సాధనా క్షేత్రంలో కూడా అంతే స్పష్టం. నీ డేరాలోంచి నీ తల బయటపెట్టకు/ సారి నీ ఆయుధం బయటపెట్టు అన్నాడాయన.

వాడ్రేవు చినవీరభద్రుడు

ఇండియా టుడే ... 4 నవంబరు 2008
5 కామెంట్‌లు

బురద కత్తులు

బురద కత్తులు
కత్తులకు బురదపూసి పూలదండలు వేసి పూజిస్తున్నారు. తొలకరికి శాంతి కురిస్తే బిచ్చగాళ్ళకు తుపాకిగుండ్లు ఉపాదనం. ఆటస్థలంలో పిల్లలు ఖాళీ తుపాకి గుండ్లు ఏరుకుంటున్నారు.
జూక్స్ బాక్స్లో యుద్దగీతం పల్లవి కప్పుగాకసాసర్లు బిలియర్డ్స్ఆడుతున్నయ్‌. అసావేరి కాకపోతే వీరావేరి.
మిస్టర్కరెంట్ ఇయర్ప్రైజ్పొందిన వాడికి బ్రీఫ్భూకరిస్తామని మ్యూజికల్నైట్స్ఎనౌన్స్చేసింది.
అవతల గృ(గ్ర)హం నుంచి వచ్చిన నిరక్షర కుక్షులు ఘట వాయిద్యానికి పనికివచ్చినా, అవిద్యా సంఘం సమావేశం ఏర్పాటుచేసింది. - అలవాటు ప్రకారం - నిర్ణయానికి రాకుండా చూడాలని..
లిపిలేని భాషను వెతుక్కుంటూ చేసిన సెర్చి ఫలితంగా వ్రాసిన రిసెర్చి పేపరు చదివి నిఘంటుడు కళ్ళనీళ్ళు కారకుండా వలవా ఏడుస్తుంటే విశ్లేషణ్ కోసం విభూతి మహాత్యం వెతికారు.
నెలకైనారాని వెన్నెలరాత్రి ఫలితంగా కవిత రాయని కవులను శిక్షాస్మృతిలో ఎన్నిరాత్రులు ఎన్ని పగళ్ళు ఎన్ని నెలలు స్వేచ్చా జీవులుగా (పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి పక్షుల్నీ పూలనీ చూస్తూ మకరందస్వాదన చేయమని మబ్బుల్లో తిరగమనీ, అక్కడికి ఎగిరి అనిమిషకన్నెల ట్యూషట్యూతీసుకోమనీ ) వదలాలి.
వెట్టి చాకిరికి వీరు వ్యతిరేక ఉపన్యాసాలిచ్చారు. కాబట్టి కసితీర వీళ్ళతోనే గడ్డపారలు పట్టించి కవిత్వ కూపాలలోనే (కూపోదకం.. వటచ్చాయా..) అమృతం ఉంటుందనే నమ్మకంతో తవ్వమనాలా?
సినిమాహాలు సంకేత స్థలంగా నిర్ణయించుకున్న పిల్లలకు (ఒకరు మగ, ఒకరు ఆడ అనవసర నిబంధన) ప్కరికి ఫస్టుక్లాసు, ఇంకొకరికి డ్రీం సర్కిల్టికెట్లు దొరుకుతై.
ఇంటిలో (వానా) కాలాన్ని బహిష్కరిస్తారని భయపడి చెమటలు పోసేటప్పటికి వాతావరణ ()కాలుష్య సందేశకుడు బంగాళాఖాతంలో అప్పుడే (అపానగాని) వాయుగుండం ఎర్పడిందని రేడియోలో చెప్తే శ్రద్దగావిని, వాయుగుండానికి వానాకాలానికి మూడుముళ్ళు వేస్తామని ఫస్టుక్లాసు డ్రీం సర్కిల్పేర్లతో డ్రాప్టురాసి పెండ్లి ప్రెస్లొ అందించారు.
ఇన్ఫ్లేషన్రోజుల్లో డ్రప్టు కూడా (చెక్కు అంటే చెల్లని కాగితం) రివాల్యూడ్కరెన్సీ అని తెలిసి కూడా ప్రొప్రయిటర్ఒప్పుకున్నా గుమాస్తా భృకుటి ముడివేశాడు. ఆహ్వానాలందుకోని పెండ్లి సంబరాలు చూడాలని పెండ్లి సంబరాలు చూడాలని రూల్లేదు. టి.వి.కాసెట్లో ఫంక్షన్రికార్డుకాకపోతే పెండ్లికొడుకు ఉత్తరకుమారుడు తన 'సైసు'ను చూచి నిశ్చేష్ఠుడైనట్లు నటించి, ఇన్విజిబుల్ఇంక్అన్పాయింటెడ్పెన్‌, ఇన్ఆడిబుల్సౌండ్ఇల్లెజిబుల్ స్క్రిప్ట్‌, అన్గ్రమాటికల్భాషలో శ్రీ శ్రీ గారినో శ్రీ ఆంద్రోబ్రెత్తో గారినో మక్కికి మక్కి కాకుండా కాపీకొట్టి వినిపిస్తుంటే అసహనంతో నైనా విన్న (నిగమ శర్మ జ్ఞాపకం భక్తి లేకుండా జాగరణ చేసిన పుణ్యుడు) మిమ్మల్ని చివరకు?
సి.వి.కృష్ణారావు
నెలనెలావెన్నెల సంకలనం-2 నవంబరు 1990

1 కామెంట్‌లు

వైతరిణికి - శ్రీ కుందుర్తి ముందుమాట

ఒక మంచి ప్రయోగం


ఏ కావ్యానికైనా ఒక కథ అనేది వుంటుంది. ఇది యితివృతానికి సంబంధించిన కథ. కాని యీ కావ్యం వెనకాల మరో కథ వుంది. ముందుగా మనవిచేస్తాను.


శుమారు ఆరేండ్ల క్రితం మిత్రులు శ్రీ సి. నారాయణరెడ్డికి కరీంనగరంలో సన్మానం జరిగిన సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను. ఆరోజుల్లో చిరంజీవి కృష్ణారావు ఆ జిల్లాకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు. మాకుగల స్నేహ బాంధవ్యాలవల్ల నేను సన్మాన సంఘంవారి ఈతిథ్యం స్వీకరించక కృష్ణారావు యింట్లో మకాంవేశాను. అప్పటికి కృష్ణారావు ఏమీ వ్రాయడంలేదు. దాదాపుగా కవితా సన్యాసంచేసి కూర్చున్నాడు. ఆఅరాత్రి చాలా చాలా పొద్దు పొయ్యేవరకు సాగిన సంభాషణలో , ఏ పూర్వజన్మ సుకృతంవల్లనో కొద్దో గొప్పో అబ్బిన కవితా శక్తిని సాధనద్వారా పదును పెట్టుకోకుండా లౌకిక వ్యవహార నిమగ్నతవల్ల దానిని గాలికి వదలి పెట్టడం ఎంత అన్యాయమో నేను వివరించాను. నాకు మొదల్నుంచి రెండు పిచ్చులున్నాయి. ఒకటి నేను వ్రాసినా వ్రాయకపోయినా కనపడిన ప్రతివాడినీ రాయమనీ ప్రోత్సహించడం, రెండవది ఆధునిక వచన గేయానికి సంప్రదాయవాదులైన కవి పండితుల మెప్పును గూడా వీలైనంత వరకు సాధించడం, ఆనాటి నా వాదన ఆయన గుండెల్లో పశ్చాత్తాప ఆనలజ్వాలలు లేపిందని నాకు తెలియలేదప్పుడు. తరువాత ఒక ఏడాది వ్యవధితో ఒకసారి మా యింటికి వచ్చి "ఇదిగో, నీవుకోరిన కావ్య"మని చేతికందిచ్చాడు. నేనా విషయం ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ అది స్పృహకు వచ్చి పరమానంద భరితుణ్ణయ్యాను. అందువల్ల యీ కావ్యము కృష్ణారావు బిడ్డమత్రమేకాదు, నా బిడ్డకూడా. పైగా నేను స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున ప్రకటించ బడుతున్నందువల్ల దీనితో నా బంధుత్వం మరీ ఎక్కువైంది. రచనలో ఎంత బద్దకం చూపాడో తత్ర్పచురణలో గూడా అంత చేయబట్టి గాని లేకుంటే ఇది ఏనాడో అచ్చు గావలసింది. సకాలంలో అచ్చయి వుంటే కృష్ణారావు యిటువంటి మరికొన్ని కావ్యాలు యీ పాటికి వ్రాసి వుండేవాడని నాకు గట్టినమ్మకం. అయినా యిప్పుడు మించి పోయిందిలేదు.


ఈ కవి యావదాంధ్రావనిని సుమారు ఒక దశాబ్దం పాటు ముంచెత్తిన అభ్యుదయ కవితోద్యమంలో పుట్టి పెరిగినవాడు. అందువల్లనే యా కావ్యంలో యితివృత్తం అధోజగత్సహోదదుల దుర్భర నిత్యజీవిత వర్ణనగా రూపొందింది. మురికి వాడల్లో నివసించే బీదా బిక్కి ప్రజల జీవితంలోని కఠోర సత్యాలను ప్రజల దృష్టికి తీసికొని రావడానికి, తద్వారా వ్యంగ్యంగా సంఘంచేస్తున్న మహాపరాధాన్ని స్ఫురింపచేయడానికి చేసిన యా ప్రయత్నం నూటికినూరు పాళ్ళు అభ్యుదయ ప్రయత్నం. ఈ మురికివాడకు తనే చెప్పినట్లు, యీ "ఒకొక్క నగరం దేహం మీద మానని రాచపుండుల"కు కవిగారు పెట్టిన ముద్దుపేరు "వైతరణి". మానవాభ్యదయానికి ఆటంకంగా యీ మహానది ప్రవహిస్తున్నదని, దారిద్ర్యానికి ఐశ్వర్యానికీ మధ్య దాటరాని సరిహద్దుగా తయారైందని బహుశా కవిగారి వూహ.


వచన కవితోద్యమానికి ప్రత్యేకంగా ఒక తత్వమంటూ ఏమీలేదని ఆనాటి అభ్యుదయ కవిత్వపు తత్వమే మరికొంత విస్తృతమైన రూపంలో యిమిడి వున్నదనీ నేనొక సందర్భంలో ప్రతిపాదించాను. ప్రత్యేక తత్వంలేకుండా ఒక ఉద్యమమం ఉంటుందా? అనే సందేహం అలా వుంచుదాం. ఉద్యమం అంటున్నానంటే యిది ఒక ఉధ్యమస్థాయిలో వ్యాపిస్తూవున్నదని చెప్పడమే నా భావం. ఇప్పటికీ అభ్యుదయ కవితా తత్వమే రాజ్యం చేస్తున్నదనడానికి యీ కావ్యం మంచి ఉదాహరణ.ఉఒక దృష్టితో చూస్తే గురజాడ, రాయప్రోలులతో ప్రారంభమైన నవ్య కవిత్వ మంతా అభ్యుదయోద్యమంలో భాగమే. కొత్తనుగురించి అన్వేషించిన ప్రతి ప్రయత్నమూ అభ్యుదయోద్యమ నిర్వచనం కిందకే వస్తుంది. ఈ జరిగిన ప్రయత్నాల్లో కూడా కొన్ని అనుకొన్నంత కొత్తను సాధించలేకపోవడం , పాతదానినే కొత్తమూసలో పోయడం వంటివికూడా జరుగుతూవుంటాయి. ప్రేమ కవితా ప్రభావితమై సాగిన నవ్య కవితోద్యమ శాఖ యిటువంటిది. ఫలితమేదైనా కొత్తకోసం జరిగిన ప్రయత్నం కాబట్టి, ఉదారంగా అలోచిస్తే అభ్యుదయ తత్వపు విశాలార్థ కిందికి తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం యొక్క పర్యవసానమేమిటి, అది ప్రజలను ఎంతగా ఆకర్షించింది, ఆనందపరచింది, వారు దానినెంతగా ఆదరించారు అనే ప్రశ్నలు తర్వాత. ఆరంభంలో సరియైన దారినేరిఎంచుకొని మధ్యలో పొరపాటున అడ్డదారులు తొక్కే ఉద్యమాలు కొన్ని: కళ కళకోసమే అని నమ్మిన ప్రేమ కవులు ఎంత విఫలులైనారో, అభ్యుదయ తత్వం ఒంటబట్టి కూడా ప్రయోగం ప్రయోగం కోసమే అన్న ధోరణిలో రచనలుచేసిన ప్రయోగవాద కవులు కూడా అంతే విఫలులయ్యారు. ప్రజలకూ కవిత్వానికీ గల సంబంధం సరిగా గుర్తించనందువల్లే యీ వైఫల్యం పొందవలసి వస్తుంది. స్థూలంగా చూసినట్టయితే ఏ కాలంలోనైనా రెండే రెండు కవితా తత్వాలు వుంటాయి. ఒకటి ముందుచూపు; రెందవది వెనుక చూపు. ముందుచూపుగ కవిత్వం అభ్యుదయ కవిత్వం. అయితే ప్రతి కవీ కాలప్రభావంచేత కొద్దో గొప్పో ముందుచూపు కలిగే వుంటాడు. జరిగే మార్పుకు అతడు కూడా దోహదం చేస్తూనే వుంటాడు. అందువల్ల కవులందరికి సమిష్టి కృషిగానే సంప్రదాయం కొంచం కొంచంగా మారుతూ వుంటుంది. ప్రజల ఆమోదం పొందుతూ, వారిని తనతో పాటు తీసికపోతూ, మార్పు వస్తుంటుంది. ఈ విధంగా జరిగే మార్పు స్థిరంగా దేశంలో పాతుకుపోతుంది.


అదే సమయంలో కొందరు తీవ్రవాదులు ఒకటినుండి వందవరకు ఒకేసారి గంతేసినట్లు, ప్రజలను తమతో తీసికెళ్ళాలనే ధ్యాస వదలి తామొక్కరే ముందుకు పరుత్తారు. ఈ ప్రజలు మూఢులంటారు; తామొక శతాబ్దం ముందున్నామంటారు; యీ పాడు ఆంధ్రదేశములో పుట్టబట్టి కాని ఏ యింగ్లండులోనో పుట్టినట్లయితే తనకు నోబిల్‌బహుమతి వచ్చివుండేదని నమ్ముతారు. ఇదంతా తన దేశము, తన కాలము, తన ప్రజలను నిర్లక్ష్యముచేసి, నేలవిడిచి చేసే సాముగా తయారవుతుంది. మనకు చూడడానికి కొంత వినోదముగా వుంటుంది తప్ప యిటఉవంటి ఉద్యమాలవల్ల ఫలితమేమి వుండదు. ప్రజలను విస్మరించిన ప్రతి కవితోద్యమము ఏమైనదో సాహిత్య చరిత్ర తెలిసిన వారికి విదితమే.


గురజాడనుండి క్రమ పరిణామం పొందుతూ వస్తున్న కవితా విప్లవంలో యీ నాటికి తేలిన సారాంశమేమంటే, కవితా స్వరూపం అభ్యుదయభావన, స్వరూపంలో వచనా కవితా పద్ధతి. ఈ రెంటినీ సమర్థవంతంగా నిర్వహించడమూ నేటి కవుల కర్తవ్యం, ఈ దృష్టితో చూసినట్లయితే కవిత్వంలో కేవలం రసానుభూతి వాదన నిలవదు. ఆచరణలో అది కవితా పరిధిని సంకుచితంచేసి, కవితా వ్యవసాయాన్ని దాని యందభిమానం గల కొందరు మేధావులకు మాత్రమే పరిమితం చేస్తుంది. అప్పుడు ప్రభంధ కవులకూ మనకూ వుండే తేడా చాలా స్వల్పం. అందుకే ఆధునిక కవిత వస్త్వాశ్రయ మార్గానికి తిరగాలని నేనంత పట్టుదలగా ప్రతిపాదించడం. సామాజిక అభ్యున్నతి సండేశంగాగల అభ్యుదయ కవిత్వానికి వస్త్వాశ్రయ మార్గమే చక్కగాఉపకరిస్తుంది. దాని విస్త్రుతికి దోహదం చేస్తుంది. ప్రభంధాలలోని వస్త్వాశ్రయత కేవలం నామమాత్రం. వర్ణనాధిక్యతవల్ల అవి దాదాపు మన ప్రేమ కవుల ఆత్మాశ్రయ కవితా భావనలకు దగ్గరి చుట్టాలుగా వున్నాయి. కాగా అనుసరణీయము భారతములోని వస్త్వాశ్రయ మార్గము.


"వైతరణి" కావ్యంలో ఒకే కేంద్ర కథావస్తువునకు సంబంధించిన వివిధ భావపరంపర ఒకదానితో ఒకటి పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో సమకూర్చబడింది. అందువల్ల వస్త్వాశ్రయ కావ్యమార్గానికి చాలా దగ్గిరలో వుంది. ఒకే విషయాన్ని గూర్చిన మనసులో భావజలధి మననంచేసి రసామృత ఖండాన్ని పుట్టించే అలవాటు చాలామంది ఆధునిక కవులకులేదు. పాఠకుని హృదయంలో రసావిష్కరణ చాలా సులభంగా జరుగుతుందనుకుంటున్నారు. లేకుంటే పాఠకులది తప్పనుకుంటున్నారు. కావ్యంలో తాను ప్రతిష్టించే వివిధ ప్రతిభాంశలచేతా, తన అనుభూతిని జగదనుభూతితో మేళవించి ప్రజల హృదయాలను చూరగొనాలనే సంకల్పంచేతా కవి కృతకృత్యుడు కాగలగుతాడు. ఆ విధమైన కావ్యాలను సృష్టించగలిగినప్పుడే ఆధునిక కవితలో వచ్చిన విప్లవం సార్థకమవుతుంది..


వచన కవితా వికాసం జరగడానికి వస్త్వాశ్రయ మార్గం అనుసరణీయమని అంఘీకరిస్తే ఆ మార్గం పూర్తిగా వృద్ధిపొందడానికి మిత్రులు డా. అరిపిరాల విశ్వం స్థాపించిన "భావలయ" సిద్ధాంతము, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య ప్రతిపాదించిన "భావగణ" సిద్ధాంతము బాగా వుపయోగపడే సాధనాలు. వీటినిగురించి యింకా స్పష్టముగా నిర్వచించవలసి వుంది. ఈ "వైతరిణి" కావ్యం "భావలయ" సిద్ధాంతానికి చక్కని లక్ష్యమని నా అభిప్రాయం.


"మండు వేసవిలో

మల్లెపూల అంగడి పెట్టినవారు

పాలబుగ్గల పసి పిల్లడికి

పనస తొన అందించినవారు" అని ప్రారంభమైన ఖండికలో కవితా శిల్ప రహస్యం చక్కగా ఆవిష్కరించబడింది. తన కథానాయకులైన మురికి పేట వాసులు తమ సహజవృత్తులను అవలంభిస్తూనే సంఘానికి ఎంత మహోపకారం చేస్తున్నారో , వారి వునికి సంఘానికి ఎంత అవసరమో వర్ణన స్పష్టం చేస్తున్నది. ఇటువంటి ప్రయోజన కారులను మురికిపేటల్లో బధించి వుంచడం సంఘం చేస్తున్న దోషమనే వ్యంగ్యం భాషింపచేస్తూ చేసిన యీ వర్ణన మనోహరంగా వుంది. "వెలుతురుస్తంభం" అనే ఖండికలో కవి

"మహామహులు ప్రయాణంచేసే శకటాలకు అనామకులైన సారథు"లైన తన కథా నాయకులు "అన్యాయపు ఆజ్ఞలు శిరసావహించని అనుమానాస్పదులైన సైలికు"అలి కూడా చెప్పి ప్రజల్లోల్ర్ తిరుగుబాటు తత్వాన్ని స్పురింపజేసి ఒక హెచ్చరిక చేసాడు. "చీకటిలో వెలురు స్తంభం నాటించి, సామాన్య మానవుడు అసామాన్యుడని చాటించి అందరికీ వెలుగును పంచి క్రొత్త త్రోవలు త్రొక్కుతారట" తన కథానాయకులు. ఇంతకంటే కవితాత్మకంగానూ, సరళ మనోహరంగానూ ప్రజల స్వభావాన్ని వర్ణించడం కష్టసాద్యం.


చిరంజీవి కృష్ణారావు ఆధునిక తెనుగు సాహిత్యానికి పాత కాపే. ఆయనను గురించి ఎక్కువగా రాయనవసరంలేదు. కాని నాకు అభిమాన ప్రయోగమైన వ్స్త్వాశ్రయ కవితా మార్గంలో యీ ప్రయత్నం జరిగింది కాబట్టి యింతగా రాయవసి వచ్చింది. తీరికలేని ఉద్యోగపు విధులను నిర్వర్తించుకుంటూనే, సాహిత్యానికి కొంత సమయాన్ని సమకూర్చుకో గలిగితే ఆయన యింకా యిటువంటి యింతకంటే మంచి కావ్యాలు రాయగలడని నా విశ్వాసం.


కుందుర్తి

ఫ్రీవర్స్ ఫ్రంట్ , హైదరాబాదు.

25.01.1967


...౬౯౦.....

3 కామెంట్‌లు

నెలనెలా వెన్నెల 2వ కవితా సంకలనం



నెలనెలా వెన్నెల 2 కవితా సంకలనం నవంబరు 1990లో వెలువడింది.
అందులోనుంచి సి.వి.కృష్ణారావు గారి మాట

నెలనెలా ...
సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం ఆగష్టు రెండవ బుధవారు నాడు ఆప్యాయతగా కలుసుకొన్న అయిదుగురం నగ్నముని, పె.ఎన్‌.స్వామి, చంద్రశేఖర్‌, కలగా వెంకట సుబ్బారావు. నాటికి వీడ్కోలు చెప్పుకొనే వేళకు కవిత్వం గురించి ఒక్కరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించలేదు. కాని అదే మాదిరిగా ప్రతినెలా ఒకసారి కలుసుకుందామని నిర్నయించుకున్నారు.

నూరు నెలలూ క్రమం తప్పకుండా కలుసుకుంటూనే ఉన్నారు. మా అయిదుగురి నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కలుసుకొనేవారి సంఖ్య 40 - 50కి పెరిగింది.

"నెలనెలా వెన్నెల" ఇప్పటికి ఇసుపరిచితమైన సాహిరతీ మైత్రీవేదికగా రూపొందింది. కవితా వ్యాసాంగంలో ఉన్న కొందరు మిత్రుల నెల కొకసారి కలుసుకొని ఒకరి రచనలు మరొకరికి వినిపించుకోవటానికి సమావేశాలు మంచి అవకాశం కలిగించాయి. ఉపనిషత్తులూ, ఉదాత్తభావాలూ, ఉద్రేకాలూ, విప్లవకవిత్వం, పద్యాలూ, వచనకవిత్వం, పాటలూ, ఒకే సమావేశంలో ఒకరిలొకరు సానుభూతితో వినగలుగుతున్నాం.

తెలుగు సాహిత్యంలో వివిధ భావకోవలకు చెందిన కవులు ఒకే వేదికపై చేరే అవకాశం తక్కువవుతున్న రోజుల్లో అందరూ కగలసిపోగల సహృదయ వేదికను కవిలోకానికి సమర్పించింది "నెలనెలా వెన్నెల". విమర్శ జరిగినా అది సహృద్భావ వాతావరణంలోనే. ఒక్కోనెల ఒక్కోమిత్రుడు సమావేశానికి ఆతిధ్యమిచ్చే సంప్రదాయం ఉంది. కనుక కవిమిత్రుల మధ్య వారి కుటుంబాల మధ్య ఎంతో స్నేహం, ఆప్యాయత ఏర్పడుతున్నాయి.

నెలనెలా వెన్నెల నిర్వహించిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి:
1985లో నెలనెలా వెన్నెలలో పాల్గొంటున్న కవిమిత్రుల కవితా సంకలనం ఒకటి వెలువరించాం. నెలనెలావెన్నెల సమావేశాల్లో మన జంటనగరాలలోని 250 మంది ఒకనెల కాకపోతే మరో నెలయినా వచ్చి కూర్చున్నవారే.

నిరుడు (1989) జూలై 31 'కవితా శిబిరం' ఒకటి నిర్వహించుకొన్నాం. ఆధునిక వచన, పద్యధుగేయ కవితలగురించి అధ్యయనం జరిగింది. సభ ఉదయం 11గంటలకు మదలై రాత్రి 10.30 గంటలకు ముగిసింది. ఇంతసేపూ చాలా ఆసక్తితో అందరూ పాల్గొన్నారు.

సంవత్సరం జూన్‌ 24 ఒక కవిసమయం కార్యక్రమం నిర్వహించుకొన్నాం. ప్రయోగంలో 21 మంది కవిమిత్రుల కవితలను వారి వారి పేర్లు లేకుండా ప్రచురించి, కవితలను విశ్లేషించవలసిందిగా ఆహుతులైన సబ్యులను ఆహ్వానించాము. కవి తాను అజ్ఞాతంగా ఉండి తన కవితగురించిన చర్చ చెవులారా వినగలగటమే ఆనాటి సవివరమైన చర్చల ఫలితం. ప్రయోగం మంచి ప్రయోజనమైనదిగా సాహిత్యభిమానులు ప్రశంసించారు.

ఇప్పుడు వెలువరిస్తున్న రెండవ సంకలనంలో కవితలు 40కి మించి ఉన్నాయి. వీటిలో సామాజిక స్పృహలూ, నిస్పృహలూ, రసాలూ, నీరసాలూ అన్నీవున్నాయి.

ఇదొక అవిరళమైన కృషిలో భాగంగానే స్వీకరించండి. కృషి మరింత నైపుణ్యం కోసం వెతుకులాట మాత్రమే.

సంకలనంలోని కవితల్లో ఏక సూత్రతలేదు. అయితే వివిధ భావాలూ, తత్వాలూ, వాదాలకు చెందిన కవిమిత్రుల ప్రతిభకు, పోకడలకూ అద్దంపడతాయి. లబ్ద ప్రతిష్టులు సాహితీ క్షేత్రంలో కొత్తగా నాగాలిపట్టిన కృషీవలులూ ఇందులో దర్శనమిస్తారు. కాని అన్ని కవితలలోనూ సామాన్య లక్షణం భావుకతా, నిజాయితీ.

-------------------------
సివి.కృష్ణారావు, 25 నవంబరు 1990. .......౬౦౯ దీనిలోని కవితలను విలువెంబడి పోస్టు చేస్తాము.
0 కామెంట్‌లు